ఏబీఆర్ఎస్ఎంకు తపస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) చట్టం కంటే ముందు నియమించిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని తపస్ కోరింది. ఈ మేరకు ఏబీఆర్ఎస్ఎం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణలాల్ గుప్తా, గీతా భట్లను మంగళవారం తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్ కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)కు శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత మార్కుల శాతాన్ని తగ్గించాలని సూచించారు. సిలబస్ను ఉపాధ్యాయుల బోధన విషయానికి అనుగుణంగా డిగ్రీ స్థాయిలోకి మార్చాలని తెలిపారు.
ఆర్టీఈకి ముందు నియమించిన ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు పీఎస్హెచ్ఎం పదోన్నతి పొందే అవకాశాన్ని కల్పించాలని పేర్కొన్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం సుప్రీంకోర్టులో ఉందనీ, ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. పీఎంశ్రీ పాఠశాలలపై పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఆర్టీఈ ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ఎంపీఈడీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు పాలేటి వెంకట్రావు, సూరం విష్ణువర్ధన్రెడ్డి, నరేందర్రావు, పాపిరెడ్డి, పెంటయ్య, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.