Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదు

గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదు

- Advertisement -

సమగ్ర కులగణన నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేరమా?
బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పాపమా?
బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నదెవరు..?
బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నదెవరు..?
బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
నవతెలంగాణ – వనపర్తి  

కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావని, బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర కులగణన నిర్వహించి, బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేరమా..? అని బిజెపి బిఆర్ఎస్ పార్టీలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సుపై ఇప్పటిదాకా గవర్నర్ సంతకం పెట్టకుండా తాత్సారం చేస్తే… విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నా యని, ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నెపం నెట్టడమే తప్ప బీసీలకు నిజమైన మద్దతు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కింది నుంచి పై కోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత దక్కడానికి మొదటి నుండి బీసీ సమాజమంతా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ బిజెపి నేతలు మాత్రం బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని పదేపదే బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించారని, బిజెపి నేతలు రాష్ట్ర గవర్నరును కలిసి ఉంటే గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకునే వారనీ, ఇదేమి చేయకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ అనడం సిగ్గుచేటన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నదెవరో…బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కుల గణన నిర్వహించి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తానంటే.. బిజెపి, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కడుపు మండుతోందని, ఇకనైనా బిజెపి బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆపి బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, మదనాపూర్ మండల అధ్యక్షుడు మహేందర్ నాయుడు, శ్రీరంగాపూర్ మండల అద్యక్షుడు ధర్మేంద్ర సాగర్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, నాయకులు కృష్ణ ప్రసాద్, అస్కని రమేష్, యశ్వంత్, చెలిమిల్ల రామన్ గౌడ్, రమేష్,నరేందర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -