హిట్లర్ రెడ్డి చేతిలో రాష్ట్రం
యాప్లో యూరియా లేదు..
రంగారెడ్డి జిల్లా పేరూ లేదు : బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్
నవతెలంగాణ- మహేశ్వరం
‘‘ప్యూచర్ లేని సీఎం.. ప్యూచర్ సిటీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చుట్టుపక్కల ఉన్న వారికి నష్టం.. అదే పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టం. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఓ హిట్లర్ రెడ్డి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం శనివారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తీక్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్తోపాటు పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా పక్కా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వికాసం పోయింది.. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలిందన్నారు. ‘రైతు బంధు పోయింది.. రాహుల్ బంధు’ వచ్చిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పాతరేసి కుంభకోణాల జాతర నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. యూరియాను యాప్లో పెడతామని, ఇప్పుడు యాప్ లో యూరియా కాదు కదా చివరికి రంగారెడ్డి జిల్లా పేరు లేదు.. మల్కాజ్గిరి పేరు లేకుండా చేశారని విమర్శించా రు. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. ఫోర్త్ సిటీ, ప్యూచర్ సిటీ, పేరిట విలువైన భూములను దోచుకుంటు న్నారని ఆరోపించారు. సర్ కార్యక్రమాన్ని కార్యకర్తలు అత్యంత సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, నాయకులు గెల్లు శ్రీనివాస్, తీగల విక్రమ్ రెడ్డి, మహేశ్వరం మండల అధ్యక్షులు ఆంగోత్ రాజు నాయక్, మహేశ్వరం సర్పంచ్ నవీన్, అంబయ్య యాదవ్, కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, వెంకటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మంచే పాండు యాదవ్, షబ్బీర్ పాల్గొన్నారు.



