లేదంటే అమెరికానే పని పూర్తి చేస్తుంది
చర్చలకే తొలి ప్రాధాన్యమంటూ ట్రంప్ వ్యాఖ్యలు
అవసరమైతే
గంటల వ్యవధిలో
కీలక మౌలిక వసతులు ధ్వంసం చేస్తామంటూ బెదిరింపు
ఖండించిన ఇరాన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తమకు రెండు మార్గాలే ఉన్నాయని, ఒకటి పరస్పర ఒప్పందానికి రావడం, లేదంటే తమ లక్ష్యాన్ని పూర్తి చేయడమేనని స్పష్టం చేశారు. తాము తలుచుకుంటే ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలను దెబ్బతీసే సామర్థ్యం అమెరికాకు ఉందని తెలిపారు. అయితే సైనిక చర్యల కంటే చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభించాలని తాను కోరుకుంటున్నానని వెల్లడించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఏదొక విధంగా గెలుస్తాం. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాం లేదా మా పనిని పూర్తిచేస్తాం. సైనిక చర్యల వల్ల కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చర్చలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. సుమారు 9.1 కోట్ల మంది ప్రజలపై ప్రభావం పడాలని నేను కోరుకోవడం లేదు. అందుకే ఒప్పందం చేసుకోవడానికే ఇష్టపడతా. అవసరమైతే గంట వ్యవధిలోనే వారి వంతెనలను కూల్చేయగలం. విద్యుత్ సరఫరా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయగలం. వారు నిర్మించిన భారీ ఆధునిక విద్యుత్ కేంద్రాలన్నింటినీ నిర్వీర్యం చేయగలం. ఆ విషయం వారికి కూడా తెలుసు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఒకప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమెరికాపై తీవ్ర విమర్శలు చేసింది. ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రజలు అనుభవిస్తున్న బాధను అమెరికా ఎప్పటికీ అర్థం చేసుకో లేదని పేర్కొంది. అమెరికాకు నాగరికత, చరిత్ర, గౌరవం లేదని తెలిపింది. వ్యక్తులను చంపవచ్చుకానీ వారి ఆశయా లను కాదని పేర్కొంది. ఖమేనీని హతమార్చినప్పటికీ ఆయన ఆలోచనలను అంతమొందించలేరని చెప్పింది. సెంట్ సీసాను పగులగొట్టవచ్చు కానీ దాని పరిమళాన్ని ఆపలేరని ఇరాన్ రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.



