అయోధ్యలో నీట మునిగిన రోడ్డు

అయోధ్యలో నీట మునిగిన రోడ్డు– వీధులు జలమయం
– ఆరుగురు అధికారులపై వేటు
– ఉన్నతస్థాయి విచారణకు ఫైజాబాద్‌ ఎంపీ డిమాండ్‌
లక్నో : వర్షాలకు యూపీలోని అయోధ్య అతలాకుతలమవుతున్నది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామపథ్‌లో నీళ్లు నిలిచాయి. అయోధ్యలో కొత్తగా 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డుని నిర్మించారు. కాగా.. గత మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామ్‌ పథ్‌ లోని 15 బైలేన్‌లు, వీధులు జలమయమయ్యాయి. రోడ్డు పక్కనున్న ఇండ్లు నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ధ్వంసమైంది. దీంతో, ఆరుగురు ప్రభుత్వ అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిపై వేటు వేసింది. ఈ వ్యహరంలో అహ్మదాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ భువన్‌ ఇన్‌ఫ్రాకామ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు యూపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. రామ్‌పథ్‌ నిర్మించిన కొద్దిసేపటికే దెబ్బతిందని పీడబ్ల్యూడీ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. పనిలో అలసత్వం ప్రదర్శించి సామాన్య ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీశారని ఆరోపించింది. దీనిపై తదుపరి విచారణ జరుగుతున్నదని పీడబ్ల్యూడీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అజరు చౌహాన్‌ తెలిపారు.
ఉన్నతస్థాయి కమిటీ వేయాలి : ఫైజాబాద్‌ ఎంపీ
ఈ విషయంపై ఫైజాబాద్‌ ఎంపీ అవధేష్‌ ప్రసాద్‌ స్పందించారు. సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) నాయకులతో కలిసి రామ్‌ పథ్‌, ప్రభుత్వాస్పత్రి సహా అయోధ్యలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రామ్‌ పథ్‌ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇది పెద్ద సమస్య అని.. రాముడి పేరుతో దోపిడీ జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. సకాలంలో దీనిపై విచారణ జరపాలన్నారు. ఇటు సోషల్‌ మీడియాలోనూ ఈ అంశం వైరల్‌గా మారుతున్నది. నిర్మించిన కొన్ని నెలలకే రోడ్డు జరలమయం కావటం పట్ల ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Spread the love