నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూనే గ్రౌండ్లోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలం మీంది గ్రామానికి చెందిన కాశిరెడ్డి సంజయ్ భార్గవ్ (24)గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి వద్ద ప్రయివేటు హాస్టల్లో ఉంటూ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఘట్టుపల్లిలోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో వీకెండ్లో ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతుంటాడు. శనివారం ఉదయం 11.30 గంటలకు గచ్చిబౌలి నుంచి దిలీప్, బాలప్రదీప్, అజయ్, తేజకిరణ్, ఆదిత్య, స్నేహితులతో కలిసి సంజయ్ భార్గవ్ స్టేడియానికి వచ్చాడు. క్రికెట్ ఆడుతుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో తలనొప్పిగా ఉందని ఆట మధ్యలో పక్కకు వచ్చి కూర్చొన్నాడు. అలా కూర్చున్న కొద్దిసేపటికే భార్గవ్ అక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు పరీక్షించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.