నవతెలంగాణ – హైదరాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్ సంధ్య కేయూలోని పోతన హాస్టల్ గది నం.19లో ఉంటూ రాజనీతిశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనం తరువాత గదికి వచ్చిన ఆమె మంచంపై తన వస్తువులు సర్దుకుంటుండగా సీలింగ్ ఫ్యాను ఒక్కసారిగా ఊడి మీద పడటంతో ఆమె నుదిటిపై తీవ్ర గాయమైంది. తోటి విద్యార్థినులు వెంటనే హాస్టల్ సూపర్వైజర్ శోభ సహాయంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె గాయానికి 14 కుట్లు వేశారు. అనంతరం రిజిస్ట్రార్ మల్లారెడ్డి, హాస్టల్స్ సంచాలకుడు రాజ్కుమార్ ఆమెను కలిసి పరామర్శించారు. ప్రమాద ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు.