అమెరికాలో కాల్పులు.. బాపట్ల యువకుడి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా.. ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

Spread the love