నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జిల్లాలో ఆహార కల్తీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. గురువారం తన ఛాంబర్ లో ఆహార భద్రతపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన జిల్లా ఆహార పరిరక్షణడెసిగ్నేటెడ్ ఆఫీసర్ పి. స్వాతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజారోగ్యం, ఆహార నాణ్యత మరియు కల్తీ నివారణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు మరియు హాస్టళ్లలో ఆహారాన్ని వండే సిబ్బందికి తక్షణమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వంట చేసే వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థులకు సురక్షితమైన ఆహారం అందుతుందని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పంపిణీ చేసే గుడ్లు మరియు ఇతర ముడి సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గుడ్ల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
జిల్లాలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిన పాల కల్తీపై ఆహార భద్రత అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి జాయింట్ రైడ్స్ (ఉమ్మడి దాడులు) నిర్వహించి, కల్తీకి పాల్పడే వారిపై కఠినమైన కేసులు నమోదు చేయాలని సూచించారు. చిరు, మీడియం స్కేల్ వ్యాపారులు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ పొందాలని మరియు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని మరియు కూరగాయలు మరియు పండ్ల సాగుకై పెస్టిసైడ్స్ వాడకం తగ్గించాలని తెలిపారు. ఆహార భద్రత నియమిత అధికారి పి. స్వాతి మాట్లాడుతూ.. జిల్లాలో ఆహార కల్తీని అరికట్టేందుకు తమ బృందం నిరంతరం శ్రమిస్తుందని, నిబంధనలు పాటించని వ్యాపారులపై భారీ జరిమానాలు విధిస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, భువనగిరి రూరల్ సిఐ చంద్రబాబు, పలు శాఖల జిల్లా అధికారులు మరియు సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



