నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్లో జరిగిన పేలుడికి అల్ఖైదా అనుబంధ సంస్థ ‘అల్ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) అధికారికంగా పేర్కొంది. ఆగస్టు 10న విడుదలైన యూఎన్ఎస్సీ విశ్లేషణాత్మక సహాయ, ఆంక్షల పర్యవేక్షణ బృందం తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
2025 నవంబర్ 10న రాత్రి 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కారును ఉమర్-ఎ-నబీ నడిపినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడే ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ దాడిని తొలుత పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం) అని అయి ఉంటుందని అనుమానించారు. ఓ సభ్య దేశం కూడా వరుస దాడులతో పాటు రెడ్ఫోర్ట్ పేలుడికి జేఈఎం కారణమని పేర్కొన్నట్లు యూఎన్ఎస్సీ నివేదిక తెలిపింది. తాజాగా ఏక్యూఐఎస్కు అధికారికంగా ఆపాదించడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.
2014లో ఏర్పాటైన ఏక్యూఐఎస్.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో అల్ఖైదా కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పడిన ప్రాంతీయ అనుబంధ సంస్థ. పెద్ద ముఠాల కంటే చిన్న చిన్న చెదురుమదురు సెల్లుగా పనిచేస్తూ లాజిస్టిక్స్, ఆర్థిక నెట్వర్క్లను అభివృద్ధి చేసుకుంటోందని యూఎన్ఎస్సీ నివేదిక పేర్కొంది.
అల్ఖైదా, ఐఎస్ఐఎస్ అనుబంధ సంస్థల సామర్థ్యాలపై కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రసాయన, జీవ ఆయుధాలపై ఆసక్తి ఉన్నప్పటికీ వాటిని తయారు చేయడంలో సాంకేతిక సవాళ్లు ఇప్పటికీ ఉన్నాయని తెలిపింది.



