నవతెలంగాణ – హైదరాబాద్: రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ముంబై నగరం వైరల్ వ్యాధుల గుప్పిట్లో చిక్కుకుంది. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా కోవిడ్-19, స్వైన్ ఫ్లూ (H1N1), ఇన్ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు గణనీయంగా పెరిగాయి. దీంతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతూ అనేకమంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు స్వైన్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు కాగా, గత వారం నుంచి కోవిడ్ కేసులు మళ్లీ పుంజుకున్నాయని వైద్యులు చెబుతున్నారు. బ్రీచ్ క్యాండీ వంటి ఆస్పత్రుల్లోని ల్యాబ్లలో ప్రతిరోజూ 7కు పైగా కోవిడ్ లేదా స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒకేసారి పలు వైరస్లు వ్యాప్తిలో ఉండటంతో, లక్షణాలు ఒకేలా ఉండటంతో నిర్ధారణ కోసం పీసీఆర్ పరీక్షలు అవసరమవుతున్నాయని సీనియర్ వైద్యులు పేర్కొంటున్నారు.



