– తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తాం
– మద్దతు తెలిపిన టీఎస్యూటీఎఫ్ నాయకులు
నవతెలంగాణ-తాండూర్ రూరల్
అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని మోకాళ్లపై కూర్చొని నిరసన చేపట్టారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె 13వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు మద్దతుగా తాండూరు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, మండలాల టీఎస్ యూటీఎఫ్ ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెర వేర్చాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్న సీఐటీయూ సంఘాన్ని, అంగన్ వాడీలను అభినందించారు. ఈ సమ్మెకు తమవంతుగా ఆర్థిక మద్దతు కూడా ఉంటుందని తాండూర్ మండల కమిటీ అధ్యక్షుడు నారాయణగౌడ్, యాలాల మండల అధ్యక్షుడు భాను చైతన్య తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు భరోసా నిస్తూ, సమస్యలు పరిష్కరించే వరకూ రాజీ పడకుండా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు,యూటీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.