పాలమూరు-రంగారెడ్డిపై విచారణ వాయిదా

-పిటిషనర్‌ వాదనలు వినాల్సి ఉంది…
– రెండువారాల తర్వాతపరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ (పిటిషనర్‌ మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి తరపు న్యాయవాది) వాదనలు వినాల్సి ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అవినీతి చోటు చేసుకుందంటూ నాగం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. వేలాది మంది ప్రజలపై ప్రభావం చూపే ప్రాజెక్టుపై ఒక పిటిషన్‌ తరువాత మరో పిటిషన్‌ దాఖలు చేస్తున్నారనీ, ముందు పిటిషన్‌ విచారణలో ఉన్న విషయాన్ని పిటిషనర్‌ తెలియ జేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ తాము ఉత్తర్వులు ఇచ్చే ముందు ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినాల్సి ఉందన్నారు. తాము పిటిషన్లకు సంబంధించిన సమాచారాన్ని కలిపి అందించేందుకు అనుమతించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ విన్నవించారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Spread the love