భార్య సంపాదనపై భర్తకు హక్కు లేదు..సుప్రీంకోర్టు తీర్పు

నవతెలంగాణ-హైదరాబాద్ : భార్యకు చెందిన డబ్బుపై భర్తకు ఎలాంటి ఆధిపత్యం, నియంత్రణ, అధికారమూ ఉండదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా అవసరమై భార్య సంపాదనను భర్త వాడుకుంటే.. ఆ డబ్బను భార్యకు తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుంది అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సడెన్‌గా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ఓ కేసు కారణంగా నిలిచింది. ఆ కేసులో ఒక మహిళ, తన భర్త కారణంగా బంగారాన్ని నష్టపోయింది. అలా నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలని ఆమె భర్తను సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలి పెండ్లి సందర్భంగా ఆమె పుట్టింటి వాళ్లు ఆమెకు బంగారు నగలు ఇచ్చారు. అలాగే పెండ్లి తర్వాత ఆమె తండ్రి ఆమెకు 2 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. ఐతే.. శోభనం రాత్రి.. ఆ నగలన్నీ తీసుకున్న భర్త.. వాటిని భద్రపరుస్తానని చెప్పి, అతని తల్లికి ఇచ్చాడు. అంతే ఇక ఆ నగలు ఆమె చెంతకు రాలేదు. ఆ నగలను ఇదివరకు ఆ ఫ్యామిలీ చేసిన అప్పులు తీర్చేందుకు వాడుకున్నారని బాధితురాలు స్థానిక కోర్టుకు తెలిపింది. దీనిపై ఆమెకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందని 2011లో కుటుంబ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఐతే.. కేరళ హైకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. దాంతో ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం… స్త్రీ ధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కూ ఉండదని తెలిపింది. ఆమె నగలను అప్పులు తీర్చేందుకు వాడుకున్నందుకు, ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

Spread the love