రాబోయే ఎన్నికల్లో మనం గెలవాలి

– అందుకు ఏం చేద్దామో చెప్పండి
– సరైన కార్యాచరణతో ముందుకు రండి
– సీరియస్‌గా పని చేయండి
– కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే దిశానిర్దేశం
– వివిధ కమిటీలతో భేటీలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని దక్కించుకోవాలి…అందుకు ఏం చేద్దామో? చెప్పండి’ అంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే సలహాలు అడిగారు. అంతర్గ, బహిరంగ వివాదాలతో అధికారం రాబోదనీ, పని చేయకుండా పదవులు కూడా దక్కే అవకాశం ఉండబోదని తేల్చి చెప్పారు. సరైన కార్యాచరణతో ముందుకు రావాలని సూచించారు. సీనియస్‌గా పని చేయాలని హితవు పలికారు. తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన తర్వాత బుధవారం తొలిసారిగా రాష్ట్రానికి చేరుకున్న మాణిక్‌రావు బుధవారం రాష్ట్రానికి చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ముందుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఆయన… నేతలు ఉత్తమ్‌కుమారెడ్డి, జానారెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌ బాబు, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి, మహేష్‌కుమార్‌,కొండాసురేఖ, పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌, వీహెచ్‌ తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. మరోవైపు ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డికి పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందించారు. గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్య దర్శులతో సమావేశమైన ఠాక్రే… నాయకుల మధ్య విభేదాలకు దారి తీసిన పరిస్థి తులను అడిగి తెలుసుకున్నారు. గురువారం డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్‌ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మెన్లు, అధికార ప్రతినిధులతో ఠాక్రే సమావేశం కానున్నారు.
రేవంత్‌ పాదయాత్రపై నేడు చర్చ
ఈనెల 26 నుంచి హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి నిర్వహించబోయే పాదయాత్రపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమూ ఉన్నది. ఇటీవల సీనియర్‌ నాయకులంతా పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై బహిరంగంగా మీడియా వేదికల మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అధిష్టానం దూతగా దిగ్విజరుసింగ్‌.. హైదరాబాద్‌ చేరుకుని ఇక్కడ పరిస్థితులతో మేథోమధనం చేసి హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. ఆ తర్వాత మాణిక్యం ఠాగూర్‌ను ఇన్‌చార్జిగా తప్పించి మాణిక్‌రావు ఠాక్రే ఆ పార్టీ నియమించింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి జ్వాలలను కొత్త ఇంచార్జి ఎలా చల్లారుస్తారో అనేది వేచి చూడాల్సిందే.

Spread the love