చేసిన పనికి జీతం అడగటం నేరమా?

– అక్రమ అరెస్టులను ఖండించండి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ఇప్పించాలని భద్రాచలంలో శాంతియుతంగా నిరసన తెలుపున్న డైలీవేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్లను, సీఐటీయూ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌ డైలీవేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) తీవ్రంగా ఖండించింది. బుధవారం ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టేకం ప్రభాకర్‌, బి.మధు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం పర్యటన పేరుతో అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికి పదిసార్లు మంత్రికి, కమిషనర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. జీతాలు ఇవ్వాలని అడిగితే అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. 20 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ లోపే పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love