కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు..

నవతెలంగాణ – హైదరాబాద్: కిర్గిస్థాన్‌ దేశంలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగింది. కిర్గిస్థాన్‌, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు శుక్రవారం వైరల్‌ కావడం దాడులకు దారి తీసింది. అక్కడ భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మరికొంతమంది గాయాలపాలైనట్లు తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది.
‘మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి’ అని పేర్కొంది. ఈ మేరకు 24 గంటలపాటూ అందుబాటులో ఉండే ఫోన్ నంబర్‌ (0555710041)ను షేర్ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. కిర్గిస్థాన్‌లో దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు నివసిస్తున్నారు. మరోవైపు దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అక్కడి పాక్‌ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దంటూ సూచించింది. బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, పాకిస్థానీలతో సహా విదేశీ విద్యార్థుల ప్రైవేట్‌ నివాసాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. అయితే, ఈ దాడిలో పాక్‌కు చెందిన విద్యార్థుల మరణాలు, గాయాలపై నివేదికలు వచ్చినప్పటికీ తమకు ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని పాక్‌ రాయబార కార్యాలయం తెలిపింది.

Spread the love