భారత్‌లో ఉన్నతోద్యోగులకు ఫేస్ బుక్ షాక్..

నవతెలంగాణ వెబ్ డెస్క్: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ ఉద్యోగుల తొలగింపును మరింత వేగవంతం చేసింది. తాజాగా మరో 6,000 మందికి లేఆప్స్ ఇస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మార్చిలో ఆ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించిన విషయం విధితమే. దాదాపు 10 వేల మందిని తొలగిస్తామని మార్చిలోనే ప్రకటించిన మెటా… వీటిని ఏప్రిల్‌, మే నెలలో రెండు విడతలుగా చేపడతామని కూడా అప్పుడే వెల్లడించింది. అందుకనుగుణంగానే ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపింది. తాజాగా మరో ఆరు వేల మందిని తొలగించే ప్రక్రియకు తెరతీసింది. మార్కెటింగ్‌, సైట్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంజినీరింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ సహా చాలా విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా ఇంజీనిరింగ్‌యేతర విభాగాల్లో అత్యధిక మందినికి ఉద్వాసన పలుకుతున్నట్టు సమాచారం. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పింక్‌ స్లిప్స్‌ అందుకున్న వారిలో భారత్‌లో పలువురు ఉన్నతోద్యోగులు ఉన్నట్టు సమాచారం. మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్ అవినాశ్‌ పంత్‌, మీడియా పార్ట్‌నర్‌షిప్స్‌ డైరెక్టర్‌ సాకేత్‌ ఝా సౌరభ్‌ సైతం ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇలా భారత్‌లో మార్కెటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, మానవ వనరుల విభాగాల్లో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు.

Spread the love