వన్డే ప్రపంచకప్‌ ముసాయిదా షెడ్యూల్‌…

– భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ల షెడ్యూల్
నవతెలంగాణ – హైదరాబాద్

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో ఐసీసీ ప్రపంచకప్‌ సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ ముసాయిదా షెడ్యూల్‌ ను బీసీసీఐ వెల్లడించింది. ‘బీసీసీఐ ఈ ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీతో పంచుకుంది. ఆ తర్వాత మిగతా దేశాలకు ఈ షెడ్యూల్‌ను అందిస్తారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న అనంతరం తుది షెడ్యూల్‌ను రూపొందిస్తారు’ అని ఓ క్రీడాఛానల్‌ తెలిపింది.
ఈ ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం..
– అక్టోబర్‌ 5న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. రన్నరప్‌ జట్టు న్యూజిలాండ్‌తో తలపడే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.
– నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ ఉంటుంది.
– నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్‌ కోసం వేదికలను ఇంకా ప్రకటించలేదు.
– ఇక భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తలపడనుంది.
– చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగనుంది.
– భారత్‌ లీగ్‌ దశలోని మ్యాచ్‌లను మొత్తం 9 నగరాల్లో ఆడనుంది. పాకిస్థాన్‌ 5 నగరాల్లో తన లీగ్‌ మ్యాచ్‌లను ఆడనుంది.
మొత్తం 10 టీమ్‌లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా మరో రెండు జట్లను నిర్ణయిస్తారు.
భారత్‌ ఆడే మ్యాచ్‌ల వివరాలు..
అక్టోబర్‌ 8 : ఆస్ట్రేలియాతో.. వేదిక చెన్నై
– అక్టోబర్‌ 11 : అఫ్గానిస్థాన్‌తో.. వేదిక దిల్లీ
– అక్టోబర్‌ 15 : పాకిస్థాన్‌తో.. వేదిక అహ్మదాబాద్‌
– అక్టోబర్‌ 19 : బంగ్లాదేశ్‌తో .. వేదిక పుణె
– అక్టోబర్‌ 22 : న్యూజిలాండ్‌తో .. వేదిక ధర్మశాల
– అక్టోబర్‌ 29 : ఇంగ్లాండ్‌.. వేదిక లఖ్‌నవూ
– నవంబర్‌ 2 : క్వాలిఫయర్‌ జట్టుతో.. వేదిక ముంబయి
– నవంబర్‌ 5 : దక్షిణాఫ్రికాతో.. వేదిక కోల్‌కతా
– నవంబర్‌ 11 : క్వాలిఫయర్‌ జట్టుతో.. వేదిక బెంగళూరు

పాకిస్థాన్‌ మ్యాచ్‌ల షెడ్యూల్
పాకిస్థాన్‌ ఐదు నగరాల్లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 6, 12 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 15న భారత్‌తో (అహ్మదాబాద్‌), ఆస్ట్రేలియాతో బెంగళూరులో (అక్టోబర్ 20), అఫ్గానిస్థాన్‌తో (అక్టోబర్ 23), దక్షిణాఫ్రికాతో (అక్టోబర్ 27) చెన్నైలో తలపడనుంది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో అక్టోబర్‌ 31న, బెంగళూరులో న్యూజిలాండ్‌తో నవంబర్ 5న (డే మ్యాచ్), నవంబర్‌ 12న కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ ఆడనుంది.

Spread the love