నవతెలంగాణ – అనంతపురం
ఫుడ్ పాయిజన్ కావడంతో 26 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విద్యార్థులు గుడ్డుతో పాటు టమాటా రైస్, పెరుగన్నం తిన్నారు. ఆ తర్వాత 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని అనంతపురంలోని అమరావతి ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిని హాస్టల్ వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.