నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవభవృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించుకున్న నేటి శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నాం. ఈ భృతిని పొందే అర్హత వయసును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గిస్తున్నాం అని కేసీఆర్ ప్రకటించారు.