నవతెలంగాణ – పరకాల
మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శనివారం బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దుగ్యాల రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలవికాస వాటర్ ప్రోగ్రాం మేనేజర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా 2004 నుంచి బాలవికాస సంస్థ శుద్ధ జలాలను అందిస్తుందని, ఇప్పటివరకు 1630 గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలే యజమానులుగా వ్యవహరించే ఈ ప్రాజెక్టు ద్వారా 35 లక్షల మందికి స్వచ్ఛమైన నీరు అందుతోందని, 20 లీటర్ల శుద్ధ జలాన్ని కేవలం మూడు నుంచి ఐదు రూపాయల లోపు ధరకే అందిస్తున్నామని వివరించారు. గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 80 శాతం బాలవికాస భరిస్తుండగా, మిగిలిన 20 శాతం ప్రజల ఉమ్మడి భాగస్వామ్యంతో సమకూర్చుకోవాలని తెలిపారు. ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలం, విద్యుత్, పైపులైన్ వంటి సౌకర్యాలను గ్రామ పంచాయతీ కల్పించాలని కోరారు. పథకం సమర్థవంతమైన నిర్వహణ కోసం మంచినీటి కమిటీని ఏర్పాటు చేసి, ఆపరేటర్లకు శిక్షణతో పాటు ప్లాంట్ నిర్వహణపై పూర్తి అవగాహన కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ బాల మోహన్ రెడ్డి, ఫీల్డ్ కోఆర్డినేటర్ విమల్, ఉప సర్పంచ్ సిలువేరు ప్రవీణ్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



