నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులు వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నదని, వచ్చే రెండు నెలలు ఎండలు మరింత తీవ్రం కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎకువగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించారు. ఏప్రిల్, మే నెలల ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తామని తెలిపారు.