రెజ్లర్‌ సుశీల్‌కు బెయిల్‌

Wrestler Sushil granted bail– మర్డర్‌ కేసులో మల్లయోధుడికి ఊరట
న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌కు ఎట్టకేలకు న్యాయస్థానం నుంచి ఊరట లభించింది. 2021లో న్యూఢిల్లీలోని ఛత్రశాల్‌ స్టేడియంలో జరిగిన ఘర్షణలో జాతీయ మాజీ జూనియర్‌ చాంపియన్‌ సాగర్‌ను తీవ్రంగా కొట్టి చంపిన కేసులో సుశీల్‌ కుమార్‌ ఏ1 ముద్దాయి. సుశీల్‌ కుమార్‌ మూడున్నర సంవత్సరాలుగా జైల్లోనే మగ్గుతున్నాడని. 222 మంది సాక్షులలో ఇప్పటివరకు 21 మందిని మాత్రమే విచారించారని… ఈ కేసులో విచారణ పూర్తయ్యేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని జాప్యం కారణంగా సుశీల్‌కుమార్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫున న్యాయవాది ఆర్‌ఎస్‌ మాలిక్‌, సుమీత్‌ షోకీన్‌లు వాదించారు. 2021 మేలో సుశీల్‌ కుమార్‌ను అరెస్టు చేయగా మోకాలు శస్త్రచికిత్స నిమిత్తం ఓ వారం రోజుల మధ్యంతర బెయిల్‌పై హాస్పిటల్‌లో చేరాడు. ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయటంతో మూడున్నరేండ్ల తర్వాత సుశీల్‌ కుమార్‌ జైల్‌ నుంచి బయటకు రానున్నాడు.

Spread the love