– బస్సులో మర్చిపోయిన ప్రయాణికుడు
– తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో వేలం
నవతెలంగాణ -కరీంనగర్
బస్సులో ఓ ప్రయాణికుడు తన పందెం కోడిని వదిలి వెళ్లిపోయాడు. దాన్ని ఏం చేయాలో తోచక రెండ్రోజులుగా చూసిన ఆర్టీసీ సిబ్బంది కోడిని వేలం వేస్తున్నారు. ఈ విచిత్ర ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. కరీంనగర్ -2 డిపో పరిధిలోని బస్సులో మూడ్రోజుల కిందట ఓ వ్యక్తి వెంట తీసుకొచ్చిన పందెం కోడిని మరిచిపోయాడు. దాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో ఆర్టీసీ కరీంనగర్ -2 డిపో మేనేజర్ ఈ నెల 12న శుక్రవారం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో బహిరంగ వేలం వేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొనాలని ఇచ్చిన ప్రకటన నోటీసు సోషల్మీడియాలో వైరల్గా మారింది.