– ఢిల్లీలోనే ఇరువురి మకాం… కేంద్రమంత్రులతో రేవంత్ భేటీలు
– సంక్రాంతి వేడుకల కోసం హస్తినకు తమిళి సై రాజకీయ పర్యటన కాదు : గవర్నర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…ఇరువురూ సంక్రాంతి పండగ పూట దేశ రాజధాని ఢిల్లీలోనే గడపనున్నా రు. ఐఏసీసీ పెద్దలు, కేంద్ర మంత్రులతో భేటీ నిమిత్తం సీఎం శుక్రవారం రాత్రే ఢిల్లీ విమానమెక్కిన సంగతి విదితమే.మరోవైపు హైదరాబాద్లోని రాజ్భవన్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై ఆ తర్వాత ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అయితే తనది రాజకీయ పర్యటన కాదనీ, కేవలం సంక్రాంతి వేడుకల్లో పాల్గొనే నిమిత్తమే హస్తినకు వెళుతున్నానని ఆమె వివరణిచ్చారు. కాగా సీఎం రేవంత్… ఈనెల 21 వరకూ ఢిల్లీలోనే గడపనున్నారు. నామినేటెడ్ పదవులు, ఇతరత్రా అంశాలపై ఆయన చర్చించనున్నారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఈనెల 19న లండన్ వెళ్లి, అక్కడి నుంచి 21న హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఇటు గవర్నర్, అటు సీఎం ఇరువురూ ఒకే సమయంలో ఢిల్లీకి చేరుకోవటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.