– ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దోజు శ్రావణ్ కుమార్
నవతెలంగాణ-సత్తుపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగావకాశాలు చూపకుండా విస్మరిస్తున్నాయని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మద్దోజు శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో జరిగిన ఆ సంఘ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో శ్రావణ్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపడం మాట అటుంచితే ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి శ్రీకారం చుట్టడంతో దేశంలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతని మభ్యపెట్టడానికి మతం, కులం అనే పేరుతో దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ. 4వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు వాటి ఊసేలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. యువతని నిర్వీర్యం చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. అనంతరం ఏఐవైఎఫ్ నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాగరాజు, కార్యదర్శిగా ఎస్కే పాషాను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి నిమ్మటూరి రామకృష్ణ, రూరల్ మండల కార్యదర్శి తడికమళ్ల యోబు, నాయకులు గాదె రవి, కంచ శ్రీను, వల్లూరి శ్రీను పాల్గొన్నారు.



