నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అశ్వారావుపేటకు చెందిన పదో తరగతి విద్యార్థి చరణ్తేజ రాసిన ‘అత్యాశకు పోతే’ కథకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. ఖమ్మం లోని మంచి కంటి భవన్లో ఆదివారం జరిగిన ఉరిమల్ల ఫౌండేషన్ ఎనిమిదో వార్షికోత్సవ సభలో చరణ్తేజ ను నగదు బహుమతి, జ్ఞాపిక, ధ్రువీకరణ పత్రంతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి కొండపల్లి నిహారిణి, మహిళా చైతన్య సమితి నిర్వాహకురాలు సుమతి, ఫౌండేషన్ అధ్యక్షురాలు సునంద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. చిన్నారులు రాస్తున్న కథలు సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ, సామాజిక అంశాలను ప్రతిబింబించేలా ఉంటున్నాయని తెలిపారు. బాల కథకులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.
చరణ్తేజ కు జాతీయస్థాయి పురస్కారం లభించడం పై అతని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత, ఉపాధ్యాయులు, సీఆర్పీ ప్రభాకరాచార్యులు చరణ్తేజ ను అభినందించారు.



