Wednesday, August 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు!

ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు!

- Advertisement -

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసంలో మేడిన్ ఇండియా ( భారత తయారీ) వస్తువులు ప్రపంచంలో ప్రతి మూలకూ చేర్చటం లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. “ఉన్నమాట అన్నా వు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన మాట” అనే సినిమా పాటను గుర్తుచేశారు. పాడిందే పాడరా అన్నట్లుగా ఇలాంటి మాటలు ఎన్నిసార్లు చెబుతారు, దేశాన్ని ఎటువైపు తీసుకుపోతు న్నారన్నదే అసలైన సమస్య. ప్రధానిగా తొలి ఆగస్టు పదిహేను అంటే 2014 ప్రసంగంలో మేకిన్ ఇండియా(భారత్‌లో తయారీ) పిలుపునిచ్చారు. “రండి, భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఏ దేశంలోనైనా విక్రయిం చండి, కానీ వాటిని భారత్‌లోనే ఉత్పత్తి చేయాలి” అని విదేశీ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది సెప్టెంబరు 25న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాదీ ఏదో ఒక సందర్భంగా ఇలాంటి పిలుపులిస్తూనే ఉన్నారు. కనుచూపు మేరలో కూడా ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపిం చటం లేదు, అయినా పదే పదే చెబుతున్నారంటే దాన్నే మనాలి? భారత తయారీ సప్తధారల్లో జరగాలని మోడీ చెప్పారు. చెప్పిన మాట చెప్పకుండా తన కార్యాలయం రాసిచ్చిన ఉపన్యాసాలను కొత్త కొత్త పదజాలంతో కాశీ మజిలీ కథల మాదిరి ఊకదంపుడుతో కొత్తవాటిని చెప్పటం తప్ప అడుగు ముందుకు పడటం లేదు. డ్రోన్ వ్యవస్థలను మనం అభివద్ధి చేయాలని, హైపర్‌సోనిక్ రక్షణ సాంకేతిక రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలని కూడా చెప్పారు. పన్నెండేండ్లుగా ఎవరు వద్దన్నారు.

ఇప్పటికే మనకంటే ఎంతో ముందున్న దేశాలు ఈ రంగాల్లో ఇంకా ముందుకు పోతాయి. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు దేశాన్ని తయారు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పోటీతత్వం లేకపోతే వర్తమానంలో ఏ దేశమూ పరుగులో నిలవలేదు. అందుకు అవసరమైనట్లుగా పని చేశామా లేదా అన్నదే ముఖ్యం. స్విడ్జర్లాండ్‌లోని లాసానే నగరంలో 1990లో ఐఎండి బిజినెస్ స్కూలు ఉంది. దాన్నొక ప్రతిష్టాత్మక సంస్థగా పరిగణిస్తున్నారు. ప్రతి ఏటా దేశాలను ఎంచుకొని పోటీతత్వ సూచికలను ప్రకటిస్తుంటుంది. తాజా 2026 నివేదిక ప్రకారం మన దేశం 44వ ర్యాంకులో ఉంటే చైనా పన్నెండవదిగా ఉంది. ప్రధాని చెబుతున్నట్లుగా 2047 నాటికి లేదా అంతకు ముందే మనదేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా? మోడీ చెప్పినట్లు మన వస్తువులన్నీ ప్రపంచంలో అన్ని మూలలకు ఎగుమతి అవుతాయా? మాటలు కోటలు దాటటం తప్ప చేతలు గడపదాటటం లేదనే లోకోక్తి తెలిసిందే. ఇతర దేశాలతో పోటీ పడకపోవటానికి కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ కారణమని కాషాయ దళాలు చెబుతుంటాయి.2014 నుంచి అధికారం లో ఉన్న మోడీ ఏం చేశారన్నదే ప్రశ్న. తొలిసారిగా ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేసినపుడు ఐఎండి నివేదిక ప్రకారం భారత్ 2013లో 40వదిగా, చైనా 21వ స్థానంలో ఉంది.

పైన చెప్పుకున్నట్లు తాజా సూచికల ప్రకారం 44-12 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచమంతటా తిరిగి యుపిఏ హయాంలో కోల్పోయిన దేశ ప్రతిష్టను తిరిగి తీసుకువచ్చా నని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. చైనా ఎలా పెంచుకుందో, మనం ఎలా దిగజారామో దానికి కారకులు ఎవరో ఎవరిని అడిగినా చెబుతారు. ‘బుద్దులు భూములను ఏలుతుంటే రాతలు గాడిదలను కాస్తున్నాయనే’ లోకోక్తిని ఇక్కడ గుర్తు చేయకతప్పటం లేదు. మోడీ అధికారానికి వచ్చినపుడు కమ్యూనిస్టు చైనా నుంచి మనం 6,040 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకున్నాం, 2026 మార్చినెల నాటికి 13,160 కోట్ల డాలర్లకు పెరిగాయి, ఇదే సమయంలో చైనాతో వాణిజ్యలోటు 3,600-4,000 కోట్ల మధ్య ఉన్నది 11,200 కోట్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో దిగుమతులు, వాణిజ్యలోటు మరింతగా పెరగనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ నేతలు చైనా నుంచి మనం సెల్‌ఫోన్ల దిగుమతులను తగ్గించాం చూశారా మోడీ ఘనత అంటూ అడ్డుసవాళ్లు విసురుతారు. ఎలక్ట్రానిక్స్ రంగం లో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రాయితీ లిస్తున్నది గనుక అనేక కంపెనీలు మనదేశం లోనే ఫోన్లు తయారు చేస్తున్నందున దిగుమతు లు తగ్గినమాట నిజం, కానీ మొత్తంగా దిగుమతులు ఎందుకు పెరుగుతున్నట్లు ? మన వాణిజ్యలోటు పెరగటం అంటే ఏటా మనం చైనాకు అప్పనంగా అంత మొత్తాలను చెల్లిస్తున్నాం. ఎందుకీ పరిస్థితి ?

ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా ఒక భాగంగా ఉండాలని, వస్తువులను ఎగుమతి చేయాలని నిటి ఆయోగ్ నివేదికలు ఎప్పటికపుడు చెబుతూనే ఉన్నాయి. ఇదిగో ఫలానా రంగంలో అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనే 2047 నాటికి లక్ష్యాలను చేరాలంటే మొత్తం 62 అంశాల జాబితాను రూపొందించి వాటిలో 12 రంగాలను గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇన్నేండ్ల నుంచి ఎందుకు విఫలమ య్యామనే అంశాన్ని మోడీ ఎప్పుడైనా చెప్పారా? ఈ రంగాల్లోకి అత్యధికంగా ప్రయివేటు పెట్టు బడులు వస్తేనే లక్ష్యాన్ని సాధించగలమని నిటిఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి చెప్పారు. మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో జీడీపీలో 25-26 శాతం ప్రయివేటురంగ పెట్టు బడులు ఉండేవి, ఇటీవల 22 శాతానికి తగ్గాయి, అదీ కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇతర రాయితీలిచ్చినప్పటికీ పెరగకపోగా తగ్గాయి. దేశంలో ఉన్న ప్రయివేటు రంగమే ముందుకు రాకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఎలా వస్తాయి? 2047 నాటికి దేశ జీడీపీని 30లక్షల కోట్లకు చేరుస్తామని చెబుతున్నారు. అందుకు గాను వచ్చే 20ఏండ్లు ఏటా పదిశాతంపైగా వాస్తవ వృద్ధి రేటు ఉండాలని ఆర్థికవేత్తలు చెబు తున్నారు. దానికి ప్రాతిపదిక ఉందా? అలా జరిగితే ఇలా జరిగితే లక్ష్యాలను సాధించటం కష్టమేమీ కాదని చెప్పేవారు కోకొల్లలు… తనదిగాకపోతే కాశీ వరకు తాటిపట్ట మీద దేకవచ్చాన్నడట వెనుకటికి ఎవడో.

ప్రపంచ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 28శాతం కాగా మనం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ మన వాటా మూడు శాతం దగ్గరే ఉంది. 2004లో చైనా వాటా పదిశాతం లోపుగానే ఉంది. విలువలో 625 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 4.66లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఇదే కాలలో 22శాతం నుంచి 17కు, ఐరోపా ప్రాంత వాటా తగ్గి 15శాతానికి పరిమితం కాగా జపాన్ ఐదుశాతం కలిగి ఉంది.ఇదే సమయంలో మన వాటా 1.6-1.8శాతం మధ్య ఉంది, అది 2014నాటికి రెండు శాతానికి చేరింది. మోడీ ఏలుబడిలో ఇప్పటివరకు మూడుశాతానికి పెరిగింది. అమెరికా, జపాన్, జర్మనీ మూడింటి కంటే ఎక్కువగా చైనా ఉత్పత్తి ఉంది. ఆశలు, ఊహలు, అడుక్కొనే విషయాల్లో పిసినారితనం ఉండకూ డదంటారు పెద్దలు.ఇలాంటి స్థితిలో ప్రపంచ కేంద్రంగా మనదేశాన్ని మారుస్తానని, మోడీ, ఆయన భజన బృందం లోని ఆకాశానికి నిచ్చెనలు వేసే చంద్రబాబు వంటి వారు చెబితే నమ్మేదెలా ? పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తే కొన్ని రంగాల్లో పురోగతి ఉండవచ్చు కానీ మా ఊర్లో మిరియాలు తాటికాయలంత అంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. కరోనా సమయంలో చైనాలోని కంపెనీలన్ని అక్కడి నుంచి దుకాణాలు ఎత్తేసి భారత్‌కు వస్తున్నట్లు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడా చప్పుడు చేయటం లేదు. ఉత్పాదక రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తే దిగుమతులపై ఆధార పడాల్సిన పనిలేదు, ఉద్యోగ సృష్టి జరుగుతుంది.

అమెరికా అంత అగ్రరాజ్యమే మా దేశంలో పెట్టుబడులు పెడతారా లేక మీ సంగతి చూడమంటారా అని బెదిరింపులకు దిగటం వెనుక పరమార్ధం ఇదే. చైనా ఇప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తుల మీద కేంద్రీకరిస్తోంది, అది కేంద్రీకరణ తగ్గించిన రంగాల్లో మనం బలపడవచ్చని నిటి ఆయోగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 2000 సంవత్సరంలో ఆరుశాతమే, 2030 నాటికి 45శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా తదితర ధనిక దేశాలు 1948లో సోవియట్ యూనియన్, చైనా లేకుండా 23 స్థాపక దేశాలతో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్(గాట్-పన్నులు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం) జరిగింది. దీనిలో భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. అది 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థగా మారింది. అయినప్పటికీ 2001 వరకు చైనాను దానిలో చేరకుండా అడ్డుకున్నారు.అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతూ చౌకగా అనేక ఉత్పత్తులను అందచేస్తున్న క్రమంలో తమ ప్రయోజనాల కోసం అడ్డుకున్నదేశాలే సభ్యత్వం ఇవ్వక తప్పలేదు. ఆ తరువాత బీజింగ్ వెనుదిరిగి చూడలేదు, ఎగుమతుల అవకాశాలు మరింతగా పెరిగాయి. నవీకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ వచ్చాయి. మేడిన్ చైనా 2025 వంటి లక్ష్యాలు, అందుకు అవసరమైన విధానాలతో ముందుకు పోవటమే గాక అవసరమైన కార్మికశక్తి నైపుణ్యాల ను కూడా పెంచింది.

రవాణా సదుపాయాల మెరుగుదలకు విస్తరించిన రోడ్లు,రైలు, బుల్లెట్ రైళ్లను చూసి అవసరం లేకున్నా నిర్మించిందని విమర్శించిన వారే ఇప్పుడు ఔరా ఎంత ముందు చూపుతో చేశారని ముక్కున వేలేసుకుంటు న్నారు. నిజానికి మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వ పెట్టుబడులు తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటంతో స్థానికంగా కొనుగోలు శక్తికూడా పెరిగింది. తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు నేడు ఎంతో లాభసాటిగా మారాయి.2010 నుంచి పారిశ్రామిక ఉత్పత్తికి దోహదం చేయటంలో చైనా ప్రధమ స్థానంలో కొనసాగు తోంది. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని ఆక్రమించాల ని చూశారు. ఇప్పుడది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించేందుకు పూనుకున్నారు. వారికి చైనా కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఏడుపు ఏమంటే ఇప్పటి వరకు ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా రానున్న రోజుల్లో సరఫరా కేంద్రంగా కూడా మారనున్నదని దోపిడీదార్లు భయ పడుతున్నారు. జపాన్ సుజుకీ కంపెనీ మనదేశం లో మారుతీ కార్లకు కీలక విడి భాగాలను అందిస్తున్నట్లే చైనా అను సరిస్తున్నది. దుస్తుల రంగంలో 2023 వివ రాలను చూసిన పుడు చైనా ముడిసరకు ఎగుమతులు 16, ఇంటర్‌మీడియెట్ ఉత్పత్తులు 21,పాక్షికంగా తయారైనవి 47, పూర్తిగా తయారైనవి 30శాతం ఉన్నాయి. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి పలకల్లో పూర్తిగా తయారైనవి 54శాతం చొప్పున ఉన్నాయి.

విద్యుత్ వాహనాల లో 51శాతం పాక్షికంగా తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నది. ఇవన్నీ గిరాకీ మీద ఆధారపడి ఉన్నాయి.అనేక దేశాలు చైనా నుంచి విడి భాగాలను తెచ్చుకొని వాటితో పూర్తి వస్తువులను తయారు చేస్తున్నారు. అది లాభసాటిగా ఉన్నంత కాలం సాగుతుంది.చైనా లావాదేవీలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే జరుగుతున్నందున అమెరికా, మరికొన్ని దేశాలకు కడుపు మంటగా ఉంది. ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను కబళించేందుకు చూసిన శక్తులు నేడు అది విఫలమైందని, చైనా తొండి ఆట ఆడుతున్నదని అంటూ పూర్వపు రక్షణాత్మక విధానాలవైపు మళ్లుతున్నారు.పురాతన కాలంలో వివిధ దేశాల మధ్య వస్తు వ్యాపారం ఉన్నట్లు చరిత్రలో నమోదైంది. అయితే వర్తమానంలో ఎగుమతులు-దిగుమతుల క్రమం 1870లో ప్రారంభమైందని చెబుతు న్నారు. పారిశ్రామిక విప్లవం తరువాత వస్తూత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరగటంతో ఇది జరిగింది.

బ్రిటన్ ఎగుమతుల్లో ప్రధమ స్థానంలో ఉంది, ఒక దశలో అది ఎగుమతి చేసిన వాటిలో 42శాతం భారత ఉత్పత్తులు ఆక్రమించాయి.బ్రిటన్ తరువాత రెండవ స్థానంలో జర్మనీ హవా నడిచింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ముందుకు వచ్చింది .1980,90దశకాల్లో జపాన్ ఎలక్ట్రానిక్స్‌తో ప్రపంచాన్ని నింపివేసింది. నూతన సహస్రాబ్ది ప్రారంభం నుంచి చైనా అగ్రస్థానానికి చేరింది.1948లో ప్రపంచ వస్తు ఎగుమతుల విలువ కేవలం 59 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా 2025లో 26లక్షల కోట్ల డాలర్లు దాటింది.దానిలో చైనా వాటా ముందే చెప్పుకున్నట్లు 4లక్షల కోట్ల డాలర్లు దాటింది. నల్లమందు భాయీలని ప్రపంచం ఈసడించిన చైనీయులను పూర్తిగా మార్చి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాధించిన ఘనత ఇది! కాదంటారా !!

ఎం.కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -