– హాజరైన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,నానక్రామ్గూడ ప్రాంతంలో అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక హమాలీ అడ్డా వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ, అమెరికా సామ్రాజ్యవాద విధానాలు ప్రపంచ దేశాల సంపదను కొల్లగొట్టే దిశగా సాగుతున్నాయని, ప్రజలు మరియు కార్మికులపై యుద్ధ భారం మోపుతున్నాయని విమర్శించారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వం ప్రభుత్వం అమెరికన్ సామ్రాజ్యవాదం తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం ద్వారా తన గురుభక్తిని చాటుకుంటోందని విమర్శించారు. ఈ నిర్ణయం బీజేపీ విధానాలకు అనుగుణంగా ఉండడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, నాగేంద్ర, లక్ష్మీనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.



