నవతెలంగాణ – హైదరాబాద్: కరీంనగర్ బస్ స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు సీఎం ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్త చూసి సీఎం స్పందించారు. ఊరెళ్దామని వచ్చిన ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండ్లో నొప్పులు పడుతుంటే ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వాహనం వచ్చే లోపే సాధారణ ప్రసవం చేసి తల్లీ, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆర్టీసీ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.