
నవతెలంగాణ – కరీంనగర్
కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిరిసిల్ల బైపాస్ రోడ్డు లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేయబడిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఆదివారం నాడు సందర్శించారు.అక్కడ ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వచ్చిన పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.ఎన్నికల రోజు నిర్వహించు విధుల గురించి కమీషనర్ పలు కీలక సూచనలు చేసారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామాగ్రిని మరియు ఈవీఎంలను స్వీకరించిన తరువాత వాటికి భద్రతగా వారితో పాటు , కేటాయించబడిన పోలింగ్ లొకేషన్ , కేంద్రాన్ని తెలుసుకుని వారి వెంటే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటి నుండి ఎన్నికలు ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని సూచించారు. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయించబడినప్పటికీ పోలింగ్ రోజున ఉదయం 06 గంటలకే విధులకు హాజరై సంసింద్దంగా ఉండాలన్నారు. పోలింగ్ రోజున ఓటర్లను క్యూ పద్దతిలో ఉండేలా చూసుకోవాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలు , వృద్ధులతోపాటు అన్ని వర్గాల ప్రజలతో సత్ప్రవర్తనతో మెదలాలన్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రం వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి వాటిని నివారించేందుకు రూట్ ఆఫీసర్ , స్ట్రైకింగ్ ఫోర్స్ , స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులను కేటాయించామని ఆయా అధికారుల ఫోన్ నంబర్లను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని , సమస్యలు తలెత్తితే వెంటనే వారికి తెలపాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేనిదే ఎట్టిపరిస్థితుల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లరాదని, వారు పిలిస్తేనే వెళ్లాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుంటూ ఎన్నికలు ప్రశాంతగా ముగిసేలా కృషి చేయాలన్నారు.