బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై ప్రజావాణిలో ఫిర్యాదు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై ప్రజావాణిలో ఫిర్యాదు– కబ్జా నుంచి తమ భూములను కాపాడాలని వినతి
– బేగంపేట ప్రకాష్‌నగర్‌ వాసుల ఆందోళన
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తమ భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్‌ బేగంపేట ప్రకాష్‌నగర్‌ బస్తీ వాసులు మంగళవారం ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేశారు. తమ భూములను కాపాడి న్యాయం చేయాలని కోరుతూ వారు ప్రజాభవన్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్లకార్డులు, బ్యానర్లు చేత పట్టుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆయన అనుచరుడు సుధీర్‌గౌడ్‌ పేరుతో తమ భూములను కబ్జా చేస్తున్నారంటూ బస్తీవాసులు ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తమకు కేటాయించిన స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే దానం అనుచరులు బెదిరిస్తున్నారన్నారు.
బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు ఇదిలా ఉండగా అదే సమయంలో ఆందోళనను వీడియో తీస్తున్న దానం నాగేందర్‌ అనుచరుడు నాగరాజు అనే వ్యక్తిని బాధితులు చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం కొందరు రౌడీ మూకలు అర్ధరాత్రి పూట వచ్చి తమను భయాందోళనకు గురి చేస్తున్నారని బేగంపేట్‌ పోలీస్‌స్టేషన్‌లో బస్తీవాసులు ఫిర్యాదు చేశారు. ప్రజాభవన్‌ ముందు ఆందోళన చేస్తుంటే కూడా తమను బెదిరించారంటూ వారు పేర్కొన్నారు. దానం నాగేందర్‌, అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బాధితులు కోరారు.

Spread the love