నవతెలంగాణ-కాటారం
అభివృద్ధి ప్రదాత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేయడం తగదని, వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్యలు స్పష్టం చేశారు. శంకరంపల్లిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇటీవల పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న శ్రీధర్ బాబు పై ఆరోపణలు చేయడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపారు. కాటారం–కొయ్యూరు రోడ్డు పనుల్లో జాప్యం జరుగుతున్నది మంత్రి కారణంగా కాదని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లేనని వారు వివరించారు. ఈ విషయంలో ప్రజలు నిజాలను గుర్తించాలని కోరారు.
పటేల్ గుత్తే దారు సంస్థ నిర్లక్ష్య ధోరణి కారణంగానే రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి, కొత్త కాంట్రాక్టర్ ద్వారా పనులు వేగంగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని కోరారు.
పనుల్లో జాప్యం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పాటు కలెక్టర్ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే పనులను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్ నాయక్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ చీమల సందీప్, జిల్లా కార్యదర్శి అంగజాల అశోక్, సీనియర్ నాయకులు లింగమల దుర్గయ్య, విలాస్ రావు, ఏఎంసీ డైరెక్టర్ పిలమర్ రమేష్, గడ్డం పోచయ్య, తెప్పల దేవేందర్ రెడ్డి, మహేష్, పాగె సురేష్, కుమ్మరి అశోక్, నారాయణ, గూపెల్లి రాజు, కోసరి భాస్కర్, కొట్టే ప్రభాకర్, గద్దె సమ్మిరెడ్డి, రాజేష్ వెంకట్ రెడ్డి, సంతోష్, కిషోర్, శేఖర్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



