నవతెలంగాణ – పరకాల
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయించి, ప్రజల చిరకాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా చేశారని బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్ ఆరోపించారు. ప్రజల తరఫున ప్రశ్నించే నాయకులను అరెస్టు చేయించడం కాదని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి బాధ్యత అని అన్నారు.
పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం వంటి ప్రజల డిమాండ్లను సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. నడికుడలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం, ఉద్యోగాలు వంటి సమస్యలపై ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలేదన్నారు. గతంలోనే శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మళ్లీ శంకుస్థాపన చేయడం ఎందుకని ప్రశ్నించిన మేఘనాథ్, పిఎంయుఎస్ హెచ్ఎ కింద మంజూరైన డిగ్రీ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
100 పడకల ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, పరికరాలు, ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్నాయో ఎమ్మెల్యే వెల్లడించాలని కోరారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లుగా ప్రచారం చేయడం సరికాదని విమర్శించారు. బీజేపీ నాయకులను అరెస్టు చేయించడం ద్వారా ప్రజల గొంతును అణచివేయలేరని, సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని దేవునూరి మేఘనాథ్ స్పష్టం చేశారు.



