పుతిన్తో ఫోన్లో ట్రంప్ ప్రతిపాదన
దాదాపు 90 నిమిషాల పాటు సంభాషణ
మాస్కో : రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణలో ట్రంప్ ఈ ప్రతిపాదన చేశారని క్రెమ్లిన్ అధికారి యూరి ఉషాకోవ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్కు సహాయపడతానని ట్రంప్ చెప్పినట్టు యూరి ఉషాకోవ్ వెల్లడించారు. అంకారాలో జరగనున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు ట్రంప్ ఈ ప్రతిపాదన చేశారని వివరించారు. పోరాటాన్ని త్వరగా ముగించడానికి, సంక్షోభాన్ని అధిగమించడం కోసం పరిష్కారాలను కనుగొనడంలో కృషి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు మరోసారి ధ్రువీకరించారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఉషాకోవ్ పేర్కొన్నారు. ఈ సంభాషణ చాలా నిర్మాణాత్మకమైనదని అభివర్ణించిన ఉషాకోవ్.. రష్యా యొక్క ప్రాథమిక విధానాన్ని పరిగణనలోకి తీసుకుని, సంఘర్షణకు రాజకీయ-దౌత్యపరమైన పరిష్కారాన్ని రష్యా కోరుకుంటోందని స్పష్టం చేశారు.
కాగా యుద్ధానికి సంబంధించిన 1,200 కిలోమీటర్ల (745 మైళ్లు) సరిహద్దు రేఖ (ఫ్రంట్ లైన్) గురించి తాము చర్చించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. ‘‘ఈ యుద్ధాన్ని ముగించడానికి అవకాశం ఉంది. అమెరికా సంకల్పం కీలక పాత్ర పోషిస్తుంది’’ అని ఆయన టెలిగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చారు. నాటో శిఖరాగ్ర సమావేశంలో చర్చలను కొనసాగించడానికి తాము అంగీకరించినట్టు ఆయన వివరించారు. కాగా ఈ నెల 7, 8 తేదీలలో టర్కీలోని అంకారాలో జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్తో సహా 32 దేశాల అధినేతలు మంగళవారం నాటికి అక్కడికి చేరుకుంటారని అంతా భావిస్తున్నారు. యుద్ధం కారణంగా.. గత కొన్ని నెలలుగా ఇరు పక్షాలు పెద్దగా పురోగతి సాధించలేదు. భారీ వాహనాల కదలికలకు ఆటంకం కలిగించడం , నష్టాలు సంభవించేలా డ్రోన్ల తో దాడులు దీనికి ప్రధాన కారణంగా ఉంది. సంఘర్షణను పొడిగించడం, మరింత తీవ్రతరం చేయడం, పౌరులపై ఉగ్రచర్యలకు దిగటంపైనే కీవ్ , దాని యూరోపియన్ మిత్రదేశాలు ఆధారపడుతున్నాయని ఉషాకోవ్ ఆరోపించారు. రష్యాలోని అనేక ప్రాంతాలలో ఇంధన కొరతకు కారణమైన, ప్రధానంగా చమురు పరిశ్రమకు సంబంధించిన రష్యన్ లక్ష్యాలపై ఉక్రెయిన్ జరిపిన సుదూర దాడులను ప్రస్తావించారు. ‘‘యుద్ధభూమిలో వాస్తవ పరిస్థితిని పుతిన్ వివరించారు. అక్కడ రష్యన్ సాయుధ దళాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ, ఒకదాని తర్వాత మరొక ప్రాంతాన్ని విముక్తి చేస్తున్నాయి’’ అని ఉషాకోవ్ పేర్కొన్నారు.
కోస్టియాంటినివ్కా కీవ్ దళాల నియంత్రణలోనే..
తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన కోస్టియాంటినివ్కా నగరాన్ని మాస్కో దళాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యన్ కమాండర్లు శుక్ర వారం పుతిన్కు తెలిపారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఈ వాదనను తోసిపుచ్చారు. నగరం ఇంకా కీవ్ దళాల నియంత్రణ లోనే ఉందని పేర్కొన్నారు. అమెరికా రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఒక పరిష్కారాన్ని కుదిర్చేం దుకు ప్రయత్నిస్తూనే ఉంటారని, మాస్కోను మళ్లీ సందర్శించడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ చెప్పారని ఉషాకోవ్ వివరించారు. ఇరాన్తో యుద్ధంపై దృష్టి సారించడంతో అమెరికా దౌత్య ప్రయత్నాలు చాలా వరకు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇరాన్ వివాదంలో అమెరికా దౌత్యం ఒక పరిష్కారానికి సంబంధించిన కీలక అంశాలపై పరస్పరం ఆమోద యోగ్యమైన దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనడానికి వీలు కల్పిస్తుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేసినట్టు ఉషాకోవ్ వివరించారు.



