నేడు బాధ్యతలు స్వీకరించనున్న పాత పాలకవర్గాలు
కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు వీరే
సహకార శాఖ ఉత్తర్వులు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొనసాగనున్నాయి. వారినే యథావిధిగా కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పుని చ్చింది.ఈనేపథ్యంలో పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.సహకార సంఘాలకు నామినేటేడ్ లేదా ఎన్నికల ద్వారా కొత్త కమిటీలను ఎన్నుకునే వరకు పాత కమిటీ లనే కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
జిల్లాలో 10 సొసైటీలు
జిల్లాలోని 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు మరో ఫార్మర్ సొసైటీ బాధ్యతలను పాత పాలకవర్గాలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు బుధవారం జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
గత నవంబర్ నుంచి..
సొసైటీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో మెదట ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. కొత్త కమిటీలకు ఎన్నికలు నిర్వహిం చకపోవడంతో ఇంకో 3 నెలలకు పైగా వారే కొనసాగారు. ఆరు సంవత్సరాల పాటు ఉన్న పాత పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేస్తూ 2025 నవంబర్ లో ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. దీంతో పాత పాలకవర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. తాజాగా హైకోర్టు పాత పాలకవర్గాలను కొత్త కమిటీలు నియామకం అయ్యే వరకు కొనసాగించాలని తీర్పునిచ్చింది.ఆరు నెలల పాటు మాజీలుగా ఉన్న వారు కోర్టు తీర్పుతో తాజాగా పాత పదవుల్లోనే బాధ్య తలు స్వీకరించనున్నారు.



