అవినీతి అధికారులు లొంగిపోవాలి

అవినీతి అధికారులు లొంగిపోవాలి– జాగో(మేలుకో) తెలంగాణ, తెలంగాణ జలసాధన సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రిటైర్డ్‌ జడ్జి చంద్రకుమార్‌
–  కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరిపించాలని వక్తల డిమాండ్‌
నవతెలంగాణ- బంజారాహిల్స్‌
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన అధికారులు లొంగిపోవాలని రిటైర్డ్‌ జడ్జి చంద్రకుమార్‌ అన్నారు. జాగో తెలంగాణ, తెలంగాణ జలసాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన అధికారులందరూ చట్టప్రకారం అప్రూవర్‌గా మారాలన్నారు. వాళ్ళ అవినీతిని అంగీకరించి ప్రభుత్వానికి లొంగిపోవాలని సూచించారు.
మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపిం చాలని, దోషులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అవినీతికి పాల్పడిన ఉన్నత అధికా రులందరినీ నిందితులుగా ప్రకటించి సమాజం ముందు వెల్లడించాలన్నారు. కేసీఆర్‌ మొదటి నిందితుడని, హరీశ్‌రావు రెండో నిందితుడని, ఈఎంసీ ఉన్నతాధికారి మురళీధర్‌రావు తదిత రులను కూడా నిందితులుగా ప్రకటించా లన్నారు. విచారించి వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. చట్ట ప్రకారం విచారణ జరిపి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్‌ నైనాలు గోవర్ధన్‌ అధ్యక్షత వహించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్‌ పద్మజశా, తెలంగాణ విటల్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట రామయ్య, ఇంజినీర్‌ విట్టల్‌రావు, సోగరబేగం, ప్రొఫెసర్‌ జానీయా కామేశ్వరరావు, పీఓడబ్ల్యు రాష్ట్ర నాయకులు అనురాధ, ఇంజినీర్‌ వెంకటరమణ, ఇంజినీర్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love