– సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నవతెలంగాణ ఆలేరు రూలర్ : పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఆలేరు మండల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండల రెవెన్యూ కార్యాలయంలో గ్రామ పరిపాలనాధికారి సత్తిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేసి,తెలంగాణ రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను ప్రకటించాలని కోరారు.
పెన్షన్ ఉద్యోగి హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని నాయకులు గుర్తుచేశారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వ సేవలో జీవితాన్ని అంకితం చేసిన ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.సీపీఎస్ విధానం ద్వారా ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతను మార్కెట్ ఒడిదుడుకులకు వదిలేయడం సరికాదన్నారు.
గత 22 ఏళ్లుగా సీపీఎస్ విధానం కొనసాగుతున్నప్పటికీ దాని వల్ల పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.వృద్ధాప్యంలో ఉద్యోగులకు గౌరవప్రదమైన పెన్షన్ అందేలా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరణ ఒక కీలకమైన మార్పుగా నిలవాలని నాయకులు పేర్కొన్నారు.ఉద్యోగులు,ప్రభుత్వం వేర్వేరు కాదని,ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేయకూడదన్నారు.సీపీఎస్ అంతం ఉద్యోగుల పంతంగా ఉద్యోగులందరూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, సెప్టెంబర్లోగా సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు ఆకాంక్షించారుకార్యక్రమంలో స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పసుపులేటి నరేంద్రస్వామి,రిటైర్డ్ ఉద్యోగుల తరఫున పూల నాగయ్య,మాజీ డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు,గుండు జగన్ తదితరులు పాల్గొన్నారు.



