నవతెలంగాణ–ఆలేరు రూరల్ : ఆలేరు మండలం మందనపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడేలా గ్రామానికి చెందిన దొప్ప అంజయ్య రూ.5 వేల విలువైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం)ను పాఠశాలకు బహుకరించారు.విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తూ,సులభంగా అర్థమయ్యేలా బోధన సాగేందుకు టీఎల్ఎం ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి కోసం గ్రామస్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. పాఠశాల అవసరాలను గుర్తించి గ్రామస్తులు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని అన్నారు.
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పద్మశ్రీ శశిరేఖ,వార్డు సభ్యులు,సుదర్శన్,మార్కండేయ,అన్నం పెద్ద సిద్ధులు, ఉపాధ్యాయులు,గ్రామస్తులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



