సైబర్ దాడి.. అమెరికా ఆస్పత్రుల్లో నిలిచిపోయిన వైద్య సేవలు

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో పలు ఆస్పత్రులు ఒకేసారి సైబర్ దాడి బారినపడటం కలకలం రేపుతోంది. న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహోమా రాష్ట్రాల్లోని 20కి పైగా ఆస్పత్రుల్లో ఆర్డెంట్ హెల్త్ సర్వీసెస్ సంస్థ వైద్య సేవలు, ఇతర సదుపాయాలు అందిస్తోంది. అయితే, సైబర్ నేరగాళ్లు సంస్థకు చెందిన మెడికల్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడంతో ఆయా ఆసుపత్రుల్లోని వైద్య సేవలు నిలిచిపోయాయి. కాగా, ఘటనపై స్పందించిన ఆర్డెంట్ హెల్త్ సర్వీసెస్‌ సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఎమర్జెన్సీ గదుల్లోని రోగులను ముందుజాగ్రత్తగా ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొంది. ఇతర రోగులకు శస్త్రచికిత్సలు వాయిదా వేసినట్టు తెలిపింది. సాధారణ వైద్య సేవలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక సైబర్ దాడిలో ఎలాంటి సమాచారం లీక్ అయ్యిందో ఇప్పుడే చెప్పడం కష్టమని ఆర్డెంట్ సంస్థ వెల్లడించింది.

Spread the love