నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఈనెల 26 వరకు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నుంచి ఈనెల 26 వరకు మొదటి, రెండు, మూడో విడతలో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన వారు కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. 26 నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఈనెల 28 నుంచి 31 వరకు దోస్త్ ఇంట్రా కాలేజీ విడత ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని తెలిపారు. వచ్చేనెల ఒకటిన సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. కాలేజీల్లో సీట్లు ధ్రువీకరించుకున్న విద్యార్థులే ఇంట్రా కాలేజీ విడతకు అర్హులని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.