నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తున్నది. ఉత్తరాఖండ్తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మొత్తం పది ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ స్కామ్తో లింకు ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ, డెహ్రాడూన్తోపాటు చండీఘడ్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన అవకతవకల అంశంలో ఈడీ సోదాలు చేస్తోంది. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరక్ సింగ్ రావత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా బీజేపీ అతన్ని క్యాబినెట్ నుంచి తొలగించింది. పార్టీ ప్రైమరీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.