గహ్లోత్‌ కుమారుడికి ఈడీ సమన్లు..

నవతెలంగాణ – జైపుర్‌:  రాజస్థాన్‌లో ఈడీ  సోదాలు కలకలం రేపుతున్నాయి.  కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా  నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది. ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు అక్టోబరు 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక పరీక్షా పత్రం లీక్‌ కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో ఈడీ నేడు సోదాలు చేపట్టింది. సీకర్‌, జైపుర్‌లో గోవింద్‌ సింగ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, మహువా కాంగ్రెస్‌ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా నివాసంతో సహా పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఒకే సమయంలో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఇలా సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు.

Spread the love