ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాజస్థాన్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను సీఎం పదవిని వదులుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఆ కుర్చీనే నన్ను వదలడం లేదు. అది నన్ను వదలకపోవచ్చు కూడా’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్(Rajasthan CM Ashok Gehlot) కీలక వ్యాఖ్యలు చేశారు.  తన సహచర నేత సచిన్‌ పైలట్‌(Sachin Pilot) నుంచి ముఖ్యమంత్రి పీఠానికి గట్టి  పోటీ ఎదురవుతోన్న వేళ.. అశోక్‌ గహ్లోత్ ఆనాసక్తికర వ్యాఖ్యలు చేశారు.  నాలుగోసారి కూడా తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని ఓ సందర్భంలో ఓ మహిళా కార్యకర్త కోరిన విషయాన్ని, అందుకు ఆమెకు ఆయన చెప్పిన సమాదానాన్ని గహ్లోత్‌(Ashok Gehlot) గుర్తుచేసుకున్నారు. పై వ్యాఖ్యలు గహ్లోత్‌ సరదాగా చెప్పినట్టు కనిపిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్‌(Congress) గెలిస్తే సీఎం పోస్టు మళ్లీ తనదే అని పైలట్‌కు పరోక్షంగా తెలియజేసినట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
‘సోనియా గాంధీజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన వెంటనే.. ఆమె తీసుకున్న మొదటి నిర్ణయం నన్ను ముఖ్యమంత్రిని చేయడమే. నేను అప్పటికీ సీఎం అభ్యర్థిని కాకపోయినా.. ఆమె నన్ను సీఎంగా ఎంపిక చేశారు’ అని ఈ సందర్భంగా గహ్లోత్‌ చెప్పారు. 2020లో గహ్లోత్‌ ప్రభుత్వంపై అసమ్మతితో పైలట్‌ తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. అప్పుడు గహ్లోత్‌ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు కనిపించాయి. అయితే అధిష్ఠానం బుజ్జగింపులతో పైలట్‌ తన మనసు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడంతో కథ సుఖాంతం అయింది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు కూడా గహ్లోత్‌ అవే మాటలు చెప్పారు. ‘మేమంతా కలిసి ఉన్నాం. నేను ఏ ఒక్కరినీ వ్యతిరేకించడం లేదు’ అని స్పష్టం చేశారు.
అలాగే ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యంపై ప్రశ్నించగా.. ‘ప్రతిపక్ష బీజేపీ మాత్రమే ఈ జాబితాపై కలవరపడుతోంది. మేం ఘర్షణ పడటం లేదని వారు నిరాశ చెందుతున్నారు. పార్టీలో అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. నేను సచిన్‌ పైలట్‌ మద్దతుదారులతోనూ మాట్లాడుతున్నాను. నేను క్షమించు- మర్చిపో అనే మంత్రాన్ని వారు అనుసరిస్తున్నాను. అలాగే మెరుగైన ప్రత్యామ్నాయం కనిపిస్తే.. సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చుతాం’ అని చెప్పారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్‌ 25న రాజస్థాన్‌ ఎన్నికలకు వెళ్లనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్న సంగతి తెలిసిందే.

Spread the love