నవతెలంగాణ న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై రూల్ 267 ప్రకారం సభలో సుదీర్ఘమైన చర్చ నడపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే విపక్ష సభ్యుల డిమాండ్కు కేంద్రం అంగీకరించడం లేదు. మణిపూర్పై రూల్ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చే పెడతామని.. దానికి కూడా కేంద్ర హోం మంత్రి అమిత్షా సమాధానం చెబుతారని కేంద్రం చెబుతోంది. దీంతో పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాపడుతున్నాయి. బుధవారం కూడా మణిపూర్ హింసాకాండపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా సజావుగా నడవకపోవడంతో నిరసనల మధ్య సభను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలు సజావుగా జరగనివ్వకపోవడంతో అధికార, విపక్ష సభ్యులపై స్పీకర్ ఓంబిర్లా మండిపడ్డారు. సభ్యులు సభలో నడుచుకుంటున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీల ప్రవర్తనలో మార్పు వచ్చేంతవరకూ సభలో అడుగుపెట్టబోనని ఓంబిర్లా వెళ్లిపోయారు.