– ఎమ్మెల్యే రాగమయి దయానంద్
– ‘దాసరి’ కుటుంబ సౌజన్యంతో పాఠశాలలకు 10వేల నోట్బుక్స్ వితరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
విద్య వికాసానికి నాంది పలుకుతుందని, తద్వారా ఉన్నతంగా అభివృద్ధి చెందుతామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. మండలంలోని శ్రీదాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికి దాసరి కుటుంబ సౌజన్యంతో ఏర్పాటు చేసిన నోట్బుక్స్ను అందించారు. వీరారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు, మనవడు వెంకట్రామిరెడ్డి (చిట్టినాయన), మధుమోహనరెడ్డి (మధుబాబు) వితరణగా అందించిన ఈ నోట్బుక్స్ను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. విద్య అనేది మన ఉన్నతికి బాటలు వేస్తుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, ఎంపీడీవో ఆర్ చిన్న నాగేశ్వరరావు, బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు మాట్లాడారు. పాఠశాల హెచ్ఎం ఎం. జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నోట్బుక్స్ దాతలు సత్తుపల్లి వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, దాసరి మధుమోహనరెడ్డి, ఉపాధ్యాయులు బూరుగు సుధీర్ (బుల్లితెర ఆర్టిస్ట్), దొడ్డా ప్రభాకరరావు, బి. మాధవి, చెరుకు శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివా వేణు, నెక్కంటి సాయిబాబా, గంగారం మాజీ సర్పంచ్ కోటమర్తి రమేశ్, మధుబాబు అనుయాయులు కోలగట్ల చెన్నకేశవరావు, ఊకే రమేశ్ (కరాటే), కావేటి అప్పారావు, జల్లిపల్లి వాసు, యామాల ముత్యాలరావు, కోటమర్తి జవహర్లాల్, కంచి శ్రీనివాసరావు, బండారు జగదీశ్ పాల్గొన్నారు. అనంతరం వన మహౌత్సవం సందర్భంగా గంగారం గ్రామంలో విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అంతకు ముందు బేతుపల్లి చెరువు వద్ద మొక్కలు నాటారు. అలాగే మండలంలోని పెద్ద పాకలగూడెం, చిన్న పాకలగూడెం, రామగోవిందాపురం, ప్రకాశ్నగర్, హరిజనవాడ, రామానగరం, రాళ్లబంజర తదితర గ్రామాల్లోని పాఠశాలలకు 10వేల నోట్బుక్స్ను అందించినట్లు దాసరి మధుమోహనరెడ్డి తెలిపారు.