జులై 1 నుంచి అమల్లోకి

Effective from July 1– కొత్త క్రిమినల్‌ చట్టాలపై కేంద్రం నోటిఫై
– వెనక్కి తీసుకోవాలి : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫై చేసింది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)-2023, భారతీయ సాక్ష్య బిల్లు(బీఎస్‌)-2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌)- 2023లు 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్పీసీ) కోడ్‌ -1973, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌(ఐఈఏ)-1872 స్థానాలను భర్తీ చేయనున్నాయి. వీటికి పార్లమెంట్‌ ఆమోదం తరువాత, డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. ఆ తరువాత చట్టాలుగా మారాయి. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలకు కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏడేండ్లు, అంతకు పైబడి శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్‌ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నాయి. భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా, ఐపీసీలో ఉన్న 19 నిబంధనలను తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనల్లో జరిమానా పెంచగా.. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా మార్చారు.
ఉపసంహరించుకోవాలి : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్‌
కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మూడు చట్టాల అమలు నిర్ణయాన్ని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. ఇది తన హామీ నుంచి వెనక్కి వెళ్లి దేశ ప్రజలను మోసం చేయడమేననీ, డ్రైవర్లను బాధితులుగా చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొంది. నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరిం చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌. లక్ష్మయ్య ప్రకటన విడుదల చేశారు. సంఘం ఆఫీస్‌ బేరర్లు, వర్కింగ్‌ కమిటీ సమావేశాలు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో తిరువనంతపురంలో జరగనున్నాయని, కార్యాచరణతో సహా ఈ అంశంపై చర్చిస్తామని తెలిపారు. రోడ్డు రవాణా కార్మికులు, భాగస్వామ్యదారులందరూ నోటిఫికేషన్‌ను రద్దు చేయడానికి కార్యాచరణ కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love