రైతు భరోసా నిధుల విడుదలకు ఎన్నికల సంఘం బ్రేక్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్‌.వేణు కుమార్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది.
ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావించారు. తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

Spread the love