సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఆవిర్భావం

సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఆవిర్భావం– మార్చి3,4,5 తేదీల్లో ఖమ్మంలో ఆలిండియా మహాసభ : సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా కార్యదర్శి పోటు రంగారావు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మూడు విప్లవ పార్టీలైన సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ(ఎంల్‌), సీపీఐ(ఎంల్‌) రివల్యూషనరీ ఇన్షియేటివ్‌ కలిసి సీపీఐ(ఎంల్‌) మాస్‌లైన్‌ పార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయని సీపీఐ(ఎంల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, ఐక్యతా సమావేశ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పోటురంగారావు తెలిపారు. సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఆవిర్భావం సందర్భంగా ఖమ్మంలో మార్చి 3,4,5 తేదీల్లో ఆలిండియా మహాసభను జరుపుతామని తెలిపారు. మూడోతేదీ బహిరంగ సభ ఉంటుందనీ, నాలుగు, ఐదు తేదీల్లో 300 మంది ప్రతినిధులతో మహాసభ జరుగుతుందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని మార్క్స్‌భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ..ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దేశాన్ని మత ప్రాదిపదికన చీల్చాలని చూస్తున్నాయని విమర్శించారు. మోడీ సర్కారు ఓవైపు దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదనీ, మరోవైపు ప్రజలను మతం పేరుతో విభస్తున్నదని వివరించారు. నేడు దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సాధించడం కోసం రాముడినీ, మతాన్నీ పెద్ద ఎత్తున బీజేపీ వాడుకుంటున్నదని విమర్శించారు. మతసామరస్యాన్ని కోరుకునేవారంతా బీజేపీ రాజకీయ కోణాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య భారత దేశం కోసం, సోషలిస్టు వ్యవస్థ స్థాపన కోసం తాము కృషిచేస్తామన్నారు. ఇతర విప్లవ శక్తులను కలుపుకుని బలమైన విప్లవోద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. సీపీఐ(ఎంల్‌)ఆర్‌ఐ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం మాట్లాడుతూ.. శత్రువులంతా ఒక్కటవుతుంటే కమ్యూనిస్టు పార్టీలు మాత్రం చీలిపోతుండటం ఆందోళన కరమన్నారు. విప్లవం కోసం పనిచేస్తున్న వారంతా ఒకే పార్టీగా ఐక్యంగా కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేజీ.రామచందర్‌, కె.రంగారెడ్డి, కె.రమ, వి.కృష్ణ, ఆర్‌.చంద్రశేఖర్‌, చండ్ర అరుణ, ఎం. అన్వేశ్‌, ఎస్‌ఎల్‌.పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love